||సుందరకాండ ||

||అరువది ఏడవ సర్గ తెలుగులో||


|| ఓమ్ తత్ సత్ ||
శ్లో|| ఏవముక్తస్తు హనుమాన్ రాఘవేణ మహాత్మనా|
సీతాయా భాషితం సర్వం న్యవేదయత రాఘవే||1||
స|| మహాత్మనా రాఘవేణ ఏవం ఉక్తః తు హనుమాన్ సీతాయా భాషితం సర్వం న్యవేదయత||
తా|| ఆ రాఘవునిచేత ఆవిధముగా అడగబడిన హనుమంతుడు సీతతో మాట్లాడినది అంతా నివేదించెను.
|| ఓమ్ తత్ సత్ ||

సుందరకాండ.
అథ సప్తషష్టితమస్సర్గః||

అప్పుడు ఆ రాఘవునిచేత ఆవిధముగా అడగబడిన హనుమంతుడు, సీతతో మాట్లాడినది అంతా నివేదించెను.

'ఓ పురుషోత్తమా ! దేవి జానకి పూర్వము చిత్రకూటములో జరిగిన వృత్తాంతము నీకు గుర్తుగా ఈ విధముగా చెప్పెను'.

'ఓకప్పుడు నీ దగ్గర సుఖముగా నిద్రించి వున్న సీత నీకన్న ముందు మేల్కొనెను. అప్పుడు ఒక వాయసము ఆమె స్తనముల మధ్య పొడెచెను. భరతాగ్రజుడవైన ఓ రామా! ఆ తరువాత నీవు దేవి అంకములో నిద్రపోయివట. ఆ పక్షి మళ్ళీ వచ్చి ఆ దేవికి బాధ కలిగించెను. అపక్షి మళ్ళీ మళ్ళీ వచ్చి బాధించెను. అప్పుడు నువ్వు ఆ గాయమునుండి కారిన రక్తపు చుక్కలతో మేల్కొన్నావట. శత్రువులను తపించు ఓ రామా! ఆ వాయసము చేత మళ్ళీ మళ్ళీ బాధించ బడడముతో ఆ దేవి సుఖముగా నిద్రించుచున్న నీకు చెప్పినదట. ఓ మహాబాహో ! స్తనముల మధ్యలో గీరబడి వున్న ఆమెను చూచి కోపముతో రెచ్చిపోయిన పాములా బుసలు కొడుతూ నీవు ఇట్లు చెప్పితివట. " ఓ భయస్థురాలా !నీ స్తనముల మధ్యలో ఎవరు తమ గోళ్ళతో గీకిరి? రోషముతో నిండిన ఇదు తలల పాముతో ఎవరు ఆటలాడ గోరుచున్నారు?" అని. అప్పుడు అలా నిరీక్షించి తీక్షణమైన గోళ్లతో ఎదురుగా వున్న వాయసమును చూచితివట. పక్షులలో శ్రేష్ఠుడు అగు ఆ వాయసము ఇంద్రుని పుత్రుడట, శీఘ్రముగా పోవు అతడు వాయుసమానుడు. అతడు వెంటనే భూగర్భములో కి పోయెను . ఓ మహాబాహో , బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అగు రామా ! అప్పుడు కోపము చిమ్ముతున్న కళ్లతో ఆ క్షణములో అ వాయసముపై శిక్షవిధించుటకు ఆలోచించితివట. అప్పుడు దర్భాసనము నుండి ఒక దర్బను తీసుకొని,దానిని బ్రహ్మాస్త్రముగా అభిమంత్రించివట. అది కాలాగ్నివలె జ్వలిస్తూ ఆ పక్షి అభిముఖముగా ప్రజ్వరిల్లినదట. ఆ ప్రజ్వలిస్తున్న ఆ దర్భను ఆ వాయసముపై ప్రయోగించితివట. అప్పుడు ఆ జ్వలిస్తున్న ఆ దర్భ ఆ వాయసము వెంట బడెను. ఆ వాయసము తండ్రి చేత సురలచేత మహర్షిభిల చేత వదిలివేయబడినవాడై మూడు లోకములను తిరిగినా రక్షైంచువాడు లభించలేదట. ఓ అరిందమ ! భయముతో మళ్ళీ నీదగ్గరకే శరణు కోసము వచ్చెనట. ఆ వాయసము కాకుత్‍స్థుని శరణుకై వచ్చి భూమి మీద పడినప్పుడు, అది వధించుటకు తగినది అయినా నువ్వు దయతోరక్షించితివిట. ఓ రాఘవా! ఆ అస్త్రమును వ్యర్థము చేయుటకు వీలు లేక ఆ ఆస్త్రముతో ఆ వాయసముయొక్క దక్షిణ నేత్రమును తీసుకొనబడినదిట. ఓ రామా అప్పుడు ఆ వాయసము నీకు అదేవిధముగా మహారాజు దశరథునకు నమస్కరించి తన ఆలయమునకు పోయెనట'.

హనుమంతుడు సీత చెప్పిన మాటలు చెప్పసాగెను.

"శీలవంతుడైన రాఘవుడు అస్త్రవేత్తలలో శ్రేష్థుడు, సత్యవంతుడు, బలవంతుడు అయికూడా ఆ రాక్షసులమీద ఎందుకు అస్త్రములు ప్రయోగించడు?. రణములో రాముని ఎదురుకొనుటకు నాగులు సురులు మరుద్గణముల్కు కాని, గంధర్వులు కాని సమర్థులు కారు కదా. వీరోత్తము డైన ఆయనకి నాగురించి కించుత్తు సంభ్రమము అయితే సునిశితమైన బాణములతో రావణుని యుద్ధములో రావణుని అంతమొనర్చవలెను కదా. పరంతపుడు నరులలో శ్రేష్ఠుడైన రాఘవుడు లేక అన్నగారి ఆదేశము తీసుకొని లక్ష్మణుడు కాని నన్ను ఎందుకు రక్షించరు? వాయువు అగ్ని తో సమానమైన తేజస్సు శక్తి కల ఆ పురుష వ్యాఘ్రులు, దేవతలకు కూడా లొంగని వారు, నాపై ఎందుకు ఉపేక్షించుచున్నారు? నాచేత ఏదో మహత్తరమైన దుష్కృతమైనది. సందేహము లేదు. అందువలనే సమర్థులైనా ఆ పరంతపులు నన్ను నిర్లక్ష్యము చేయుచున్నారు".

'కన్నీరుకార్చుతూ చెప్పిన దీనమైన ఆమె మాటలను విని నేను కూడా మళ్ళీ ఆ పూజ్యురాలికి ఇట్లు చెప్పితిని.

"ఓ దేవీ రాముడు నీ పై శోకముతో అన్ని విషయములలో విముఖుడు. నీకు సత్యము చెప్పుచున్నాను. రాముడు దుఃఖములో ఉండుటవలన లక్ష్మణుడు కూడా పరితపిస్తున్నాడు. ఓ పూజ్యురాలా అదృష్టముకొలది నీవు కనపడితివి. చింతించుటకు సమయము కాదు.ఈ ముహూర్తమే దుఃఖముల అంతము చూచుచున్నావు. ఆ నరశార్దూలములు ఇద్దరూ, నిందించతగని మహాబలులు. ఆ రాజపుత్రులు ఇద్దరూ నీ దర్శనమునకు కల ఉత్సాహముతో లంకను భస్మము చేసెదరు. ఓ సీతా ! రౌద్రుడైన రాఘవుడు రావణుని బంధువులతో కలిపి సమరములో హతమార్చి నిన్ను తన పురమునకు తప్పక తీసుకుపోవును. ఓ దేవీ రామునికీ ఏది తెలుసునో అతని ప్రేమను ప్రతిబింబించు గురుతును నాకు చెప్పుము. ఓ మహాబలా అప్పుడు ఆమె అన్ని దిశలు పరికించి తలలో ఉన్న ఈ ఉత్తమమైన మణిని నాకు ఇచ్చినది".

'ఓ రఘురామా! ఈ దివ్యమైన మణిని నీకోసమై తీసుకొని పూజనీయురాలైన ఆమెకి నమస్కరించి నేను రిరిగివచ్చుటకు సిద్ధమైతిని మంచివన్నెకల జనకాత్మజ, తిరుగుప్రయాణముయొక్క ఉత్సాహములో పెరుగుచున్ననన్ను చూచి ఆమె మరల ఇట్లు చెప్పెను. కళ్ళనీళ్లతో నిండిన ముఖముతో, భాష్పముల వలన కలిగిన గద్గద స్వరముతో ఇట్లు చెప్పెను'.

"ఓ హనుమా ! సింహాస్వరూపులైనా ఆ రామలక్ష్మణులిద్దరిని సుగ్రీవుని అతని అమాత్యులందరినీ అడిగినట్లు చెప్పుము. మహాబాహువులు కల ఆ రాఘవుడు ఈ దుఃఖసాగరమునుంచి ఏవిధముగా రక్షించునో అది నువ్వు చూడుము. ఓ వానరోత్తమా ! రాముని వద్దకు పోయి నా ఈ తీవ్రమైన శోకము గురించి రాక్షసులచేత భయపెట్టబడుతున్న విషయమును చెప్పుము. నీ ప్రయాణము శుభము అగు గాక".

'ఓ మహారాజా ! పూజ్యనీయురాలైన సీత విషాదముతో కూడిన ఈ మాటలను నీకు చెప్పమనిది. నా చేత చెప్పబడిన ఈ సమగ్రమైన మాటలతో సీత కుశలము గా వున్నదని గ్రహించిఉంటావు'.

ఈ విధముగా హనుమంతుడు సీతతో జరిగిన తన సంభాషణ రామలక్ష్మణులకు వివరించెను.

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది ఏడవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్ ||
శ్లో|| ఏతత్త వార్యా నృపరాజసింహ
సీతా వచః ప్రాహ విషాదపూర్వమ్|
ఏతచ్చ బుద్ధ్వా గదితం మయా త్వమ్
శ్రద్దత్స్వ సీతాం కుశలాం సమగ్రామ్||37||
స|| న్పపరాజసింహ ఆర్యా సీతా విషాదపూర్వం ఏతత్ వచః తవ ఆహ| మయా గదితాం తత్ బుధ్వా సీతాం సమగ్రాం కుశలాం శ్రద్ధత్స్వ||
తా|| 'ఓ మహారాజా ! పూజ్యనీయురాలైన సీత విషాదముతో కూడిన ఈ మాటలను నీకు చెప్పమని చెప్పినది. నా చేత చెప్పబడిన ఈ సమగ్రమైన మాటలతో సీత కుశలము గా వున్నదని గ్రహించిఉంటావు'.
|| ఓమ్ తత్ సత్ ||